నా సాహితి ప్రయాణం

ఉగాది పండుగకు “సహరి” పత్రిక నాకు ఇచ్చిన కానుక. ఈ వారం”సహరి” ఆన్లైన్ పత్రికలో నా చిరు పరిచయం. సహరి పత్రిక సంపాదకులకు ధన్యవాదాలతో..🙏🌹

పేరు: వంజారి రోహిణి
జన్మస్థలం: నెల్లూరు టౌన్
చదువు: బి.ఎస్.సి., బి.ఎడ్.
సైన్స్ టీచర్ గా ఇరవైఏళ్ల అనుభవం
ప్రస్తుత నివాసం: హైదరాబాద్
కుటుంబం
భర్త: వంజారి కృష్ణ మూర్తి
టీవీ, సినిమా నటులు
సంతానం:శ్రీనివాస చైతన్య,
వైష్ణవి

అమ్మ ఆదిలక్షమ్మ గృహిణి. మా నాన్నఅరిశా సత్యనారాయణ గారు నెల్లూరు సంతపేట బి.ఎడ్ కాలేజీ ఆఫీసులో పనిచేసేవారు. చాల సామాన్యమైన దిగువ మధ్యతరగతి కుటుంబం మాది. నాకు ఒక అక్క కామేశ్వరి, అన్న కృష్ణ మోహన్ ఉన్నారు. నేను మా అమ్మ,నాన్నలకు మూడవ సంతానం. ఇంట్లో ఎవరు సాహితీ వేత్తలు లేరు. చిన్నప్పుడు దినపత్రిక తెప్పించుకునే స్తొమత కూడా లేదు. పాతకాలపు పెద్ద రేడియోలో ఒచ్చే వినోద కార్యక్రమాలు వినడమే. మా ఇంటి పక్కన శాంతి స్వీట్ హోమ్ జయరామిరెడ్డి వాళ్ళు ఆంధ్ర భూమి, ఆంధ్ర జ్యోతి వారపత్రికలు తెప్పించేవారు. వాళ్ళని అడిగి పాత సంచికలు ఇంటికి తెచ్చుకుని ఆసక్తిగా చదివేదాన్ని. నేను మొదట చదివిన నవల రావినూతల సువర్ణాఖన్నన్ గారు రాసిన “క్లిక్ క్లిక్ క్లిక్”. ఆ నవల నాపై చాల ప్రభావితం చూపింది. ఇక వరుసగా ఆంధ్రజ్యోతి, భూమి లో నవలలు, కథలు చదివేదాన్ని. ఆ తర్వాత మా మేనత్త శమంతకమణి గారు బాడుగకు నవలలు తెప్పించి చదివేవారు. ఆమె దగ్గరనుంచే నేను నవలలు బాగా చదవడం నేర్చుకున్నాను.
ఆ తర్వాత కాలేజీలో చేరాక ప్రతిరోజూ కాలేజీ అయిపోగానే సాయంత్రం నెల్లూరు ట్రంక్ రోడ్ గాంధీబొమ్మ సెంటర్ లో బస్సు దిగి స్వతంత్రవిహార్ పార్క్ పక్కన ఉన్న “పద్మావతి మహిళా గ్రంథాలయం” లో ఓ గంట పుస్తకాలు చదివిన తర్వాతే ఇంటికి వెళ్లడం నా దినచర్యలో భాగం అయిపోయింది. గ్రంథాలయంలో పుస్తక పఠనం నా ఆలోచనలను మలుపు తిప్పింది. అప్పటి గురజాడ వారి “కన్యాశుల్కం”, బుచ్చిబాబు గారి “చివరకు మిగిలేది” ఈ రెండు నవలలు దాదాపు వందసార్లు పైనే చదివిఉంటాను. రంగనాయకమ్మ గారి నవలలు కూడా చాల ప్రభావితం చేసాయి. దాదాపు అప్పటితరం కథకులు, నవలా కారులందరి రచనలను చాల వరకు చదివేసాను. డిగ్రీ చదివే నాటికి ఈ పుస్తక పఠనం ఓ ప్రియమైన వ్యసనంలా మారింది. దీర్ఘాలోచనలు పెరిగాయి. చుట్టూ ఉన్న పరిసరాలను, వ్యక్తులను,పరిస్థితులను, కళ్ళ ముందు జరిగే సంఘటనలను పరిశీలనా దృష్టితో చూడసాగాను.
1991 లో నేను డిగ్రీ చివరి సంవత్సరంలోనే ఉండగానే వివాహం జరిగింది. సంసార భాద్యతలు, ఇద్దరు పిల్లలను చూచుకోవడంలో పుస్తకాలు చదవడం తగ్గింది. డిగ్రీ తర్వాత బి.ఎడ్. కోసం చాలాసార్లు ప్రవేశ పరీక్షలో అర్హత సాధించినా ఓ.సి. క్యాటగిరి వల్ల సీట్ వచ్చేది కాదు. అప్పటివరకు నాలో అణచిఉన్న అగ్నిపర్వతం బద్దలైనట్లు ఆవేదన అక్షరరూపం దాల్చి కవితా ప్రవాహమైంది. “ఆభాగ్యుడు” అనే తొలి కవిత ఆంధ్ర భూమి పత్రికలో ప్రచురితం అయింది. అప్పుడు దాదాపు ౩౦ దాక ఇంటికి ఉత్తరాలు వచ్చాయి కవిత బాగుందని. అప్పుడు తెలిసింది రచనల్లో ఉండే మధురమైన రుచి. కానీ గృహిణిగా, టీచర్ గా భాద్యతల నడుమ రచనలపై ద్రుష్టి పెట్టలేకపోయాను. కానీ ఆ సమయంలో కొన్ని కవితలు, వ్యాసాలు రాసాను. అవి ఆంధ్రభూమి, వనితా జ్యోతి, పల్లకి లాంటి పత్రికల్లో ప్రచురితం అయినాయి. తర్వాత 2011 లో శ్రీ జగన్నాధ శర్మ గారి సంపాదకత్వంలో వెలువడే నవ్య పత్రికలో శ్రీ పీ.వీ. సునీల్ కుమార్ గారు రాసిన “సయ్యాట” నవల ముగింపు పోటీలో తృతీయ బహుమతి వచ్చింది. తొలిసారి రెండువేల రూపాయల పారితోషికం అందుకున్నాను.
2012 లో మా వారి వ్యాపారంలో నష్టాలు, తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులతో మా కుటుంబం నెల్లూరు జిల్లా గూడూరును వదిలి బతుకుతెరువు కోసం హైదరాబాద్ కి వచ్చేసాం. అప్పుడు యూసుఫ్ గూడ లో “రహ్మత్ నగర్ హైస్కూల్” లో నేను టీచర్ గా చేరాను. ఆ స్కూల్లో టీచర్ గా నేను పొందిన అనుభవాలను అక్షరీకరించి కథని రాసాను. “సూపర్ టీచర్ సిండ్రోమ్” అనే పేరుతో ఆ కథ 2016 మే నెలలో నవ్య పత్రికలో ప్రచురితం అయింది. ఇది నేను రాసిన తొలి కథ. ఆ తర్వాత వరుసగా నేను రాసిన కథలు వివిధ పత్రికల్లో ప్రచురితం అవుతూ వచ్చాయి.
నేను గూడూరులో ఉన్నప్పుడు దగ్గర నుంచి చూసిన సంఘటనలు, పరిస్థితులు ఆకళింపు చేసుకుని రాసిన “ఆసరా”, “నల్ల సూరీడు ” కథలకు బహుమతులు రావడమే కాకుండా ఆ కథలు నాకు మంచి పేరును, పలువురి ప్రశంసలను తెచ్చి పెట్టాయి. ఆ తర్వాత కథలతో పాటు కవితలు, సమీక్షలు, సౌందర్య చిట్కాలు వంటివి కూడా రాసాను. ఇప్పటివరకు 70 కథలు , 100 కవితలు వివిధ పత్రికల్లో ప్రచురితం అయినాయి.
“సహిత స్వభావః సాహిత్యం”, “హితేన సహితం సాహిత్యం” అంటే సాహిత్యం హితాన్ని చేకూర్చేది, మృదుమధురమైనది అనే విషయాన్ని నేను బలంగా నమ్ముతాను. మనం చేసే రచనల వల్ల సమాజానికి మంచి జరగకపోయినా పర్వాలేదు. కానీ చెడు మాత్రం జరగకూడదు. కానీ మంచికి మార్గాలు తక్కువ. చెడు విస్తరించడానికి, మనిషి మనసును తొలచడానికి అవకాశాలు చాల ఎక్కువ. మన రచనలు పాఠకుల హృదయానికి మధురమైన సుగంధ పరిమళాలను అద్దాలి కానీ, కులమత విద్వేషాలు, హింస లాంటి వాటిని రెచ్చగొట్టేవిధంగా పాఠకుల మనసులను మలినం చేయకూడదని నా అభిప్రాయం. నా కథల్లో మానవత్వానికే మొదటి ప్రాముఖ్యం. నేను ఊహించి కానీ, ఎక్కువ వర్ణనలు చేసికాని రాయలేను. నా కళ్ళ ముందు జరిగిన వాస్తవ సంఘటనలు, నన్ను కదిలించి కంటనీరు పెట్టించిన మనసులో నిలిచిపోయిన ప్రతి సంఘటను కథలాగా మలచడానికి ప్రయత్నం చేస్తాను.
ఈ రెండేళ్లు కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. అన్నీ రంగాల్లో నష్టాలు వచ్చినట్టే పత్రికా రంగం కూడా తీవ్ర నష్టాలు చవిచూసిన విషయం మనకు తెలిసిందే. ఎంతో పేరున్న పత్రికలు కూడా పాఠకుల ఆదరణ లేక నష్టాలు చవిచూసి ముద్రణను నిలిపివేయడం చాల విచారకరం. అయితే ఒక ద్వారం మూసుకుంటే, ఇంకో నాలుగు తలుపులు మనకోసం తెరుచుకున్నట్లు ఇప్పుడు ఈ వెలితిని ఆన్లైన్ పత్రికలు, వెబ్ పత్రికలు తీరుస్తున్నాయి. కరోనా సమయంలో చాల ఆన్లైన్ పత్రికలు వచ్చాయి. నిరంతరం అభివృద్ధి చెందుతున్న విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం సాహిత్యాన్ని పాఠకులకు మరింత చేరువ చేస్తోంది. కనుక సాహిత్యం ఓ నిరంతర చైతన్య ప్రవాహం. దానికి ఎప్పటికీ అంతం అనేది ఉండదు. ఒక రూపం నుంచి మరో రూపానికి మారి బహురూపాలుగా విస్తరిస్తూ పాఠకులకు చేరుతుంది. ఇప్పుడు ప్రపంచ సాహిత్యం పాఠకుల అరచేతి మంత్రదండం కదలికల్లోనే [సెల్ ఫోన్, లాప్టాప్] లోనే ఉంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రచయితలు కూడా కాలానుగుణంగా మారుతూ, తమ రచనలను పాఠకులకు అందించవచ్చు.
పొందిన బహుమతులు: “ఆసరా” కథకు నవ్య ఉగాది కథల పోటీలో బహుమతి వచ్చింది.

“నల్ల సూరీడు” కథకు విశాలాక్షి పత్రికా వారి కథల పోటీలో బహుమతి వచ్చింది.
“అమృతత్వం” కథకి తెలుగు కథలు బ్లాగ్ వారి కథల పోటీలో బహుమతి వచ్చింది.
మలిశెట్టి సీతారాం స్మారక కథలపోటీ, సమన్విత కథల పోటీ, స్వేరో టైమ్స్ కథల పోటీలో, జలదంకి పద్మావతి స్మారక కథల పోటీల్లో నా కథలకు ప్రశంసలు లభించాయి. వివిధ కథా సంకలనాల్లో నా కథలు ప్రచురితం అయినాయి.
ఇప్పుడు నెల్లూరు నుంచి శ్రీ ఈతకోట సుబ్బారావు గారి సంపాదకత్వంలో వెలువడే విశాలాక్షి మాసపత్రికలో నెల్లూరు మాండలికంలో రాసే “విజయమహల్ సెంటర్ కథలు” పాఠకుల నుంచి చక్కని ఆదరణ పొందడం చాల సంతోషకరం. శ్రీ కోసూరు రత్నం గారికి, శ్రీ ఈతకోట సుబ్బారావు గారికి “సహరి” పత్రికాముఖంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
నవ్యపత్రిక లేని లోటుని ఇప్పుడు “సహరి” పత్రిక తీరుస్తోంది. ఎక్కడా రాజీ పడకుండా, విలువలతో కూడిన పత్రికగా అనతికాలంలోనే ఎందరో పాఠకులకు చేరువ అయింది. గొప్ప సాహిత్యాన్ని పాఠకులకు అందిస్తోంది. సహరి పత్రిక ఇంకా గొప్ప విజయాలను పొంది పాఠకుల మనోరథంలో ఎప్పుడూ నిలిచి ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.
చక్కని సాహితీ కళామ తల్లి బిడ్డ మన “సహరి” ఆన్లైన్ పత్రికలో నా పరిచయం రావడం నాకు చాల ఆనందకరం, ప్రోత్సాహకరం. సహరి సంపాదకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. శ్రీ విరించి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు.

20 thoughts on “నా సాహితి ప్రయాణం”

  1. పెమ్మరాజు విజయ రామచంద్ర

    మీ పరిచయం చదివాను మీ పఠన శక్తి చదివితే నా కాలేజ్ రోజులు గుర్తుకొచ్చాయి. ఒక నవల 100 సార్లు చదవడం గ్రేట్.

  2. నామా పురుషోత్తం

    బాగుంది మీ పరిచయం. చదవాలనే అడక్టి ఉన్నా కొన్ని పరిస్థితులు అడ్డంకిగా మారేవి. ఆనాటి పరిస్థితులు మళ్ళీ గుర్తుకొచ్చాయి. కథలలో విషయ పరిజ్ఞానం ఉంటుంది. అందుకే కథలంటే మరింత ఇష్టం. మంచి కథలు ఇంకా మరెన్నో రాయాలని కోరుకుంటున్నాను…

      1. గొల్ల సీతారామ్

        మీ రచనలు బాగున్నాయి… మేడం గారు… మీకు అభినందనలు

  3. VISSA RAMACHANDRA RAO

    Excellent narration of your travelling in the life. I merged myself in the flow.
    Expecting that more series of stories in Vijayamahal Centre Stories.
    Best Wishes

  4. సతీష్

    మీ అనుభవం, మీ ఆసక్తి, సాహిత్యం మీద ఉన్న ప్రేమ చాలా ఉన్నతమైనది. మీరు చాలా గ్రేట్ మేడం …ఎందుకంటే పుస్తకాలు ఇంట్లో అందుబాటులో లేకుంటే చదవాలనే ఇష్టం తో ఎక్కడికో వెళ్ళి చదివారు ఆ పుస్తక పఠన శక్తి ఇప్పుడు మిమ్ములను గొప్ప రచయిత్రి నీ చేసింది…….good…

    1. వంజారి రోహిణి

      చాలా చాలా ధన్యవాదాలు అండి 🙏🙏

  5. Ch cs.sharma(cHATURVEADULA chanchu subbaiaah shar

    Naa.uru..nrllore..maa pinThagaRi..ellu..santhapeta..meekutumbam.vRUIKI..THAPPAKA.THYLISIUNTUNDI..BOMMAAKAYSAULA..ENTIPRkkana..vaari..ellu(late)meedi..Nellore..Ani..santhapeta..Ani..chadi aaka..aagarham anthaa..gurthuku..vChindi..naynuu…i20..navalali..100kadhalu25..kavithalu..10..naatakaalu .vrasaanu..urthireetyaaCiVILENGINEERdirector.technical.Rtd..kaulKu..penna.pettina..layru…sodaree…meevishayam..naKu.. haalaasanthoosham…god..blessu…mybest..wishes..to..u…

  6. Ch cs.sharma(cHATURVEADULA chanchu subbaiaah shar

    Hrudayapurvak.abhinandanalu..maadee..nelloore…god..bless..u

  7. Mounika Ratnam

    Miru anni vishayaalu chala baga chepparu mi rachanalu samajaniki manchi chese vidhamga untayi..miru inka manchi manchi rachanalu chesi mammalni happy ga unchalani manavi…

  8. Basavaraju Venugopal

    దిన పత్రికలు వార పత్రికలు చదవడం గ్రంధా లయానికి వెళ్లడం మీలోని సాహిత్య జిజ్ఞాస ను తెలుపుతోంది…మీరు మరెన్నో సాహితీ శిఖరాలను అధిరోహించాలని ఆసిస్తూ శుభాకాంక్షలు మేడం 💐💐💐💐

    1. వంజారి రోహిణి

      చాలా చాలా ధన్యవాదాలు అండి 🙏🙏

Comments are closed.