దాసాని పూల మడుగు

2023 జాగృతి కథల పోటీ లో ఎంపికైన నా కథ ” దాసాని పూల మడుగు”. కథ చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలపండి.

“శీనమ్మా ..టిఫిను డబ్బాలో అన్నం బెట్టినవా..?”

“ఆ ఆ..పెడతా ఉండాను. ఆదివారం కూడా నాకు ఈ రంది తప్పదు” ఇసుక్కుంటా బానట్లో తిరగమాత వేసిన చింతపండు గుజ్జులో కల్లుప్పు, పసుపు వేసి, కుంకుడుగాయంత ఇంగువ పెళ్ల వేసి కలీబెడుతోంది ఆదెమ్మ కుంపటి ముందర గూర్చొని. రోజు పొద్దనే పిలకాయలకి అన్నం క్యారేజీలు కడుతుంది ఆమె. ఈ ఆదివారం ఆ పనిలేదులే రవంతసేపు నడుంవాల్చొచ్చనుకుంటే పొగడదొరువు కండ్రిగకు పోయివస్తానన్నాడు శీనమ్మ ఇంటాయన సత్తెయ్య. కొళాయి గుంట దగ్గర నీళ్లు పట్టి బొక్కెనలో పోసి నాలుగు చెంబులు నీళ్ళు పోసుకున్నాడు తిరుపాలు . ఒంటిమీద నీళ్ళు జారినట్లే ఆలోచనలు వస్తా, జారిపోతా ఉండాయి. తుండు గుడ్డ మొలకు చుట్టుకోని, గోచి తీసి ఇనపకమ్మీ మీద ఆరేసి, దేవుడింట్లోకి పోయి పటాల ముందున్నలక్క డబ్బాలోనించి విభూది నాలుగువెళ్లకు రాసుకొని నుదిటిమీద అడ్డపట్టీలు పెట్టుకున్నాడు. దేవుడి పటాలకి దణ్ణం పెట్టుకున్నాడు. పంచలోకి వచ్చి దండెమ్మీద ఆరేసి ఉన్న నాలుగు మూరల పంచె నడుముకి చుట్టుకుని, ఖద్దరు బనీను వేసుకున్నాడు. బనీను నిండా చిరుగులే. మరి కొత్త బనీను కుట్టించి ఐదేళ్ల పైనే అయింది. ముందరింట్లో చిలక్కొయ్యకు తగిలించి ఉండే బులుగు గీరల తెల్ల చొక్కా తొడుక్కుంటుంటే సంకదగ్గర సర్రుమని చిరిగింది. ఇవేమి తిరుపాలుకు పట్టలేదు. ఈ తూరికి తమ నొసటన ఏమి రాసినాడో ఆ భగవంతుడు. గాల్లో దీపం పెట్టకుండా ప్రయత్నం చేయడమే మనవొంతు. ఫలితం భగవంతుడిచ్చేది. అయినా ఏదో ఒక మూలన ఆశ బతుకుమీద.

శీనమ్మ ఇచ్చిన కాఫీ నీళ్ళు తాగాడు. ” ఇంకో తూరి ఆలోచించకూడదా నువ్వ. పోయిన తూరి అంత ఆశ పడ్డాం. ఏమైంది. పెట్టినదంతా బూడిదపాలు” యూరియా సంచిలో డబ్బా పెట్టి చేతికిచ్చిన శీనమ్మ కళ్ళల్లోకి ఓ తూరి చూసి , గమ్మున సంచి తీసుకుని బైటికి నడిచాడు. తిరుపాలు పొయ్యేతలికే బస్సు కదలబోతుండాది. కండక్టర్ సత్తార్ హారను కొడతా ఉండాడు. గబాల్న బస్సు ఎక్కినాడు తిరుపాలు. బస్సు ముందుకు పోతా ఉంటే వేడిగాలి మొకానికి తగలతా ఉండాది. చేలన్నీ ఎండిపోయి బీళ్ళు పడి ఉండాయి దారిపొడుగునా. ఆకుపచ్చటి చేలు కనుచూపుమేరలో అవపడడంలే.

బస్సు కిటికీకి కర్రతుమ్మ చెట్టు కొమ్మలు రాసుకుంటా పోయినాయి. కర్రతుమ్మ పచ్చటి పువ్వు నుంచి పుప్పొడి కళ్ళల్లో పడి, కళ్ళు మండినాయి తిరుపాలుకి. అందుకోసరమో లేక మరెందుకోసరమో కానీ కళ్ళల్లో నించి నీళ్ళు కారతా ఉండాయి. ఏ దుఃఖం గుండెల్లో కాల్వలు కట్టిందో ఏమో చెంపలమీదికి జారుతున్న కన్నీటిని పై గుడ్డ తో ఒత్తుకున్నాడు. ఆలోచనలు ఒక తట్టుకి నిలవడంలే. శీనమ్మ చెప్పినట్లు కయ్యలు అమ్మేస్తే ఈ యాతనంతా ఉండదు కదా అనుకున్నాడు. నేలతల్లిని అమ్ముకోవడం అనే ఆలోచన రాగానే గుండెల్లో పట్టేసినట్లేయింది తిరుపాలుకి.

సరిగ్గా ఐదేళ్ల క్రితం ఉండే రెండెకరాల్లో సన్నాలు, డెబ్భైరెండ్లు, మూడుపిడికిళ్ల రకాల వరి ఓ ఎకరాలో పండిస్తే, మెట్ట తావున మిరప, పెసలు పండేవి. మిరప నారుతో పాటే మధ్యమధ్యలో టమేటా, వంగ, బెండ నారు, తోటాకు, పనగంటాకు, గోంగూర వేస్తే అటు తిండి గింజలకు, ఇటు కూరాక్కు దిగుల్లేకుండా బతుకు గడిచి పోయేది. అట్టా బతుకులు ఏళ్లదీస్తే బాగానే ఉండేది కానీ, ఊర్లో ఏదో ముసలం పుట్టింది. ఆశల స్థానే అత్యాశ నిచ్చెన మెట్లు గబగబా ఎక్కింది. పచ్చటి నేల తల్లి గుండెల్లో గునపాలు గుచ్చారు. పాడినిచ్చే పశువుల్ని తెగనమ్ముకున్నారు. ఒకళ్ళిద్దరు తప్ప ఊరు ఊరంతా పంట పొలాలను తవ్వి చేపల గుంటలుగా మార్చారు. చేపలు, రొయ్యల ఇత్తనాలు నీళ్ళ గుంటల్లో వదిలేస్తే లక్షల్లో లాభాలు కళ్లజూడవచ్చు అనుకున్నారు. ఇంట్లో ఉండే నగానట్రా తాకట్టు పెట్టి మరి గుంటలు తవ్వించారు.మట్టినంతా ఎత్తి కయ్యల చుట్టూ పోసి ఎత్తుగా గట్లు కట్టించారు.తమ మట్టి బతుకులు బంగారంగా మారతాయనుకున్నారు. తమ గుడిసెలు భవంతులవుతాయని కలలు గన్నారు. అందరితో పాటు తాను కూడా కలలు గన్నాడు. శీనమ్మ మెళ్ళో పసుపుతాడేసుకుని, ఉన్న ఒక్క బంగారు సరుడు తాకట్టుకిచ్చింది అయిష్టంగానే. తొలి తూరి గుంటలు నిండడానికి మోటారు పంపుసెట్లు వాడారు. గుంటలు నిండాయి. నేల తల్లి మీద తూట్లు పొడిచినందుకు కోపమో ఏమో ఆ ఏడాది ఒక్క చినుకు కూడా నేల రాల్లేదు. పెట్టిన పెట్టుబడి వొచ్చింది అంతే. అది వొడ్డీలు తీర్చేదానికి కూడా చాల్లేదు. గుడిసెలు భవంతులుగా మారలేదు. బతుకులు ఎలిగిపోలేదు. రెండో తూరి మోటార్లల్లో నీళ్లు రాలేదు. గుంటల్లో నీళ్లు ఇంకి పోతా ఉండాయి. నెల్లూరు నుంచి ట్యాంకర్లు తెప్పించినా, బీడు పడ్డ కయ్యలోమాదిరి నీటి చుక్కలు ఆవిరైపోతున్నాయి. స్తోమతున్నోళ్లు మల్లా బోర్లు తవ్వించుకున్నారు. తాను ఏ ఆధారం లేనోడు. తన గుంటల్లో కూడా నీళ్లు ఇంకిపోయినాయి. చేపలు సరిగ్గా ఎదగలా. తీరా చేపలు, రొయ్యలు అమ్మకానికి వొచ్చే సమయంలో వరదలు వొచ్చి, మొత్తం కొట్టుకుపోయినాయి. నెత్తిన గుడ్డ మిగిలింది. మార్కెట్లో నష్టం వొచ్చింది. ఇంక జన్మలో రొయ్యల గుంటలు వద్దు అనుకున్నాడు తను. పోనీ తవ్విన గుంటలు మళ్ళీ కయ్యలు చేయాలంటే ఎంత యాతన.

కయ్యలు రొయ్యల గుంటలు చేసినాక ఇప్పటికి ఒక్క తూరి కూడా కప్పల బెకబెకలు ఇనింది లేదు. వానపాములు, ఎర్రలు, నత్తలు, వానకారు కోయిలలు అయిన నీళ్ళపాములు, గాజుల శెట్టి పురుగులు, కయ్యలను ఊతం చేసుకుని ఉంటూ, నేల సారాన్ని పెంచే జీవులన్నీ మాయమై పోయాయి. చేపల గుంటలు పాచి పట్టకుండా వేసిన సున్నం పొడి, రొయ్యల, చేపల దాణాలో ఉండే రసాయనాల వల్ల ఆ జీవులన్నీ నశించిపోయినాయి. నేల సారం మొత్తం కొట్టకపోయి చౌడుభూములైనాయి. పచ్చని పంట చేల మీదికి అప్పుడప్పుడూ వచ్చి పలకరించే జముఁడు కాకులు, పక్షుల జాడే లేదు. వానలు పడితే పంట వెయ్యవొచ్చు అని ఎదురు చూడడమే మిగిలింది. ఒక్క పదును వాన పడి ఎన్ని ఏళ్ళయిందని. కయ్యల్లో చాడ పెట్టి, చెంగోవాలు కట్టి, మడుల్లో నాగాలిపర్రుతో దున్ని ఎన్నిదినాలయిందని..? పచ్చని పంట కళ్లచూసి ఎన్ని దినాలయిందని..?

బిడ్డలను సాకేదానికి నెల్లూరు సంతపేటలో ఓ చిల్లర అంగట్లో లెక్కలు రాసే గుమస్తా పనికి కుదురుకున్నాడు. ఇదిగో ఇప్పుడు నాలుగేళ్ళ తర్వాత తిని, తినకా దాచిపెట్టిన డబ్బుతో కయ్యలో కొత్త బోరు వేయిద్దామని బయలుదేరాడు. అరిచేతుల్లో పీచు టెంకాయ పట్టుకుని, మెట్ట కయ్య అంతా తిరిగి పడమటి మూలన టెంకాయ నిట్టనిలువుగా లేచిందని, అక్కడ జలధార ఉందని, అక్కడ బోరు బిట్టు వేయించమని, బోరు మిషన్ నరసయ్య పోయిన వారమే చెప్పినాడు. ఈ రోజు మళ్ళీ ఓ తూరి మాట్లాడుకొని, మంచిరోజు చూసుకుని బోరువేయించాలని ఊరికి పోతావుండాడు. గట్టిగా బస్సు హారను కొట్టేతలికి ఉలిక్కిపడి ఇహంలోకి వొచ్చాడు తిరుపాలు. వరసగా మొత్తలు, డేవిస్ పేట, ముదివర్తిపాలెం బస్సులు ఆగిఉండాయి. జనాలు గుంపులుగుంపులుగా ఉండారు. సోమరాసిపల్లి బస్సు స్టాప్ దగ్గర ఇద్దురు పోలీసోళ్ళు గూడా ఉండారు. అందరితో పాటు బస్సు దిగాడు తిరుపాలు. అక్కడ నించి బస్సులను ముందుకు పోనీకుండా ఆపేసారు. ఎందుకో తెలీక జనాలు తలా ఒక మాట అనుకుంటా ఉండారు. ఊర్లో కట్టావారి బీడులో సీమచింత చెట్టు కొమ్మకు ఊరిపోసుకున్నాడట సుబ్బానాయుడు. పోలీసోళ్ళు చెప్పారు. శవాన్ని ఇంకా చెట్టు నుంచి దించలేదట. మొదులు నరికిన అరటిచెట్టు మాదిరి నేలమీద కూలబడిపోయాడు తిరుపాలు. పోయిన వారం తనకూడా కయ్యల్లో తిరిగాడు సుబ్బానాయుడు. పిల్లకు పెళ్లి కుదిరిందని చెప్పాడు. చేపల గుంటలు తవ్వి నష్టపోయిన వాళ్ళల్లో ఒకడు. కట్నం డబ్బు సమయానికి ఈలేదని, కుదిరిన సంబంధాన్ని కాదనుకుని పోయారట మగపెళ్ళివాళ్ళు నిన్న. అందుకే ఊరేసుకున్నాడేమో. పోయిన ఏడాది బాకీలు తీర్చలేక నూనెగమండ్ల ఓబయ్య ఎండ్రిన్ తాగి తీరిపోయినాడు. ఇంకెన్ని ఘోరాలు ఈ కళ్ళతో చూడాలో. వొచ్చిన బస్సు లోనే వెనక్కి తిరుక్కున్నాడు తిరుపాలు నిస్సత్తువగా.

క్యాలండర్ లో కాగితాలు రోజుకొకటి చినగతానే ఉండాయి. ఎవరెట్టా పోయినా నేను మాత్తరం ముందుకు పోతాను అంటుంది కాలం. మీ ముంగిట్లోకి వచ్చేసాను అంది తొలకర్ల కాలం. “రేపటి మింద ఆశ ఉంటేనే మనిషి బతుకుతాడు. లేకుంటే జీవచ్ఛవం అవుతాడు” ఆలోచిస్తా ఉండాడు తిరుపాలు. తొలకరి జల్లుల సమయం. అంతా బాగుంటే ఈపాటికి కయ్యల్లో చాడ పెట్టి, చెంగోవాలు కట్టి, ఎడ్లతో పాటు తను కూడా మడుల్లో తిరిగేటోడు. పొలం అమ్మడం శీనమ్మకి కూడా ఇష్టం లేదు. కానీ వానలు పడక, పంటలు పండక, చేపల గుంటలు కూడా ఎండి పోయి, నాలుగేళ్ళ నుంచి కయ్యలమీద దమ్మిడి ఆదాయం రాలేదు. పిలకాయల చదువులు గుర్తుకువచ్చినప్పుడు మాత్రం “కయ్యలు అమ్మేయమంటూ ” జాతరలో పోతరాజు మాదిరిగా చిందులు తొక్కుతుంది.

“ఏందయ్యా..! యోచిస్తాఉండావా..” శీనమ్మ మాటకి “ఈ తూరి ఎట్టాగైనా కయ్యల్లో మసూరి రకం వొరి పంట ఏద్దాం మనం. భూమమ్మ గుండెల్లో గునపాలు గుచ్చి, గుంటలు చేశామని ఇన్నాళ్లు అమ్మకి మనమీద కోపమేమో. అయినా రొమ్ముపాలు తాగిన బిడ్డ కాలితో తంతుంటే ఏ తల్లి అయినా పసిబిడ్డను తోసేస్తుందా..? ప్రేమతో గుండెల్లోకి పొదువుకోదూ..! ఎవరు చూడొచ్చారు. ఈ తూరి వానలు పడొచ్చు. ఎండిన గుంటలు నిండొచ్చు. మళ్ళీ పంట వేయవచ్చు. బాకీలు తీర్చేయవచ్చు.” చెప్పుకుంటా పోతా ఉండాడు తిరుపాలు కలలో మాదిరిగా. ఆ దృశ్యాలన్నీ కళ్ళ ముందు కనపడుతున్నట్లు, గుండె నిండుగా ఉన్న ఆశలు, కళ్ళల్లోకి వచ్చి శీనమ్మ కళ్ళు మెరుపులీనుతున్నాయి.

ఎప్పటి మాదిరి చిన్న యానాదితో చేయించే బంకమట్టి బొమ్మ కాకుండా, విగ్రహాలు చేసే స్థపతి వెంకటయ్యని మైపాడు నుంచి పిలిపించి మెట్ట కయ్య పడమటి మూలన ఉండే గెనెమకి అనుకోనుండే పెద్ద ఏపచెట్టు కింద వినాయకుడి బొమ్మ చేయించాడు. వినాయకుడి బొమ్మ రంగురంగులుగా మెరిసిపోతా ఉండాది. పొద్దనే కయ్యల కాడికి వొచ్చి, రెండు కట్టెల పొయ్యలమీద తంపటేసి రెండు పెద్ద గంపల నిండా కుడుములు చేసారు శీనమ్మ, తిరుపాళ్లు. వినాయకుడికి కుడుములు పోస్తన్నాం రమ్మని ఊర్లో వాళ్ళని పిలవడానికి పోయినారు పిలకాయలిద్దురు. కుడుములు, బెల్లమేసిన నానుబియ్యం, వడపప్పు, టెంకాయలు, సాంబ్రాణి కడ్డీలు, కర్పూరం అన్ని సిద్ధం చేసుకునే తలికి సూరీడు నడినెత్తిమీద నుంచి పడమటితట్టుకు దిగినాడు. పొద్దున ఇంటి కాడినుంచి ఒండుకొచ్చిన నిమ్మకాయ పులుసన్నం తిని, కయ్యలోనే ఉండే చిన్న గుడిసింట్లో కాసేపు నడుం వాల్చారు. సాయంత్రానికి ఊర్లో పశువులు మేపే పిలకాయలు, పక్క పక్క కయ్యలోళ్ళు వచ్చారు. కల్లు శాంతమ్మ ఇంట్లో పూచిన ఎర్రటి ముద్ద దాసాని పూలు రెండు పెద్ద గంపల నిండా తెచ్చింది. కుమ్మరోళ్ళ సూరయ్య తాత పచ్చ గన్నేరు పూలు తెచ్చాడు. పశువుల కాళ్ళకి నాడాలు కొట్టే నన్నేసాయిబు తమలపాకులు తెచ్చాడు. నాగలి పర్రు తయారు చేసే సోమయ్య కూడా వినాయకుడి నైవేద్యానికని కుడుములు, ఉండ్రాళ్ళు తెచ్చాడు. అందరికీ ఆశే. పని ప్రారంభించేముందు వినాయకుడికి కుడుములు పోసి మొదులు పెడితే ఆ పని పూర్తవుతుందని నమ్మకం. మన ప్రయత్నం మనం చేస్తే ఈశ్వరుడి దయ ఉంటుందని నమ్మకం. ఈ రోజు బాగాలేకున్నా రేపు మంచి జరుగుతుందని నమ్మకం.

అదేంచిత్రమో గానీ ఈ మధ్యకాలంలో ఎప్పుడూ చూడని మెరుపులు తూరుపక్క. అందరి మనసులను మురిపిస్తూ. చిన్న కండ్రిగ నుంచి సుబ్బయ్య శాస్త్రి వొచ్చాడు. దాసాని పూలతో, గన్నేరుపూలతో వినాయకుడిని అలంకరించారు. గంపల నిండా పూలు. ఎన్ని దేవుడి మీద వేసినా ఇంకా వొస్తానే ఉండాయి ఎర్రెర్రని దాసాని పూలు గంపలోనించి. సుబ్బయ్య శాస్త్రి సంకల్పం చెప్పి, పసుపు గణపతి చేసి తమలపాకు మీద పెట్టి, కుంకమ బొట్టు పెట్టి పూజ చేసాడు. తర్వాత వినాయకుడికి అష్టోత్తరం చదివాడు. శీనమ్మ, తిరుపాలు ఇద్దురూ టెంకాయలు కొట్టారు. కర్పూరం ఎలిగిచ్చి గంటలు కొట్టారు. కుడుములు వినాయకుడిమీద పోశారు. పిలకాయలంతా కింద పడిన కుడుములను తీసుకుని తిన్నారు. తర్వాత పూజ కాడికి వొచ్చిన పెద్దలంతా గణపతికి కుడుములు పోశారు. రమణయ్య అందరికి పానకం, వడపప్పు పెట్టాడు. తిరుపాలు పిలగాడు వెంకటేశు అందరికి నాను బియ్యం పెట్టాడు. కూతురు యశోద పట్టపోళ్ల పిలకాయలతో ఆడుకుంటోంది. ఆ సాయంత్రం అక్కడ అందరు ఎండిన తమ బతుకులు పండాలని వినాయకుడికి మొక్కుకున్నారు. కుడుములతో నోర్లు తీపి చేసుకుని, రేపటి వెలుగుకోసం కలలు కంటా ఆ సందె చీకట్లో ఇంటిదారి పట్టారు. తిరుపాలు, శీనమ్మ లు పిలకాయలను తీసుకుని గుడిసెలోకొచ్చి పండుకున్నారు ఆ రాత్రి.

పొద్దునంతా పని చేసి ఒళ్ళు పులిసిపోయి ఉండాది ఇద్దరికి. అట్టా నడుం వాల్చాగానే నిద్దర పట్టేసింది. ఏకువ జామున ఉరుముల శబ్దానికి మెలుకవ వచ్చింది తిరుపాలుకు. గుడిసెకు కప్పిన తాటాకు చిల్లుల నుంచి టపటపా నీళ్ళు తిరుపాలు ఒంటిమీద పడ్డాయి. దిగ్గున లేచి కూర్చున్నాడు. బైట కుండపోత వాన. చెక్క తలుపు గొళ్ళెం తీసాడు బైటికి వద్దామని. విసురుగా లోపలి కొట్టింది వానజల్లు. తలుపు మూసేసి గొళ్ళెం పెట్టేసాడు.

పొద్దునకి రవంత తెరిపి ఇచ్చింది వాన. మోకాళ్ళ లోతు బురదలో పరిగెత్తాడు తిరుపాలు వినాయకుడి బొమ్మ కాడికి . ఏప చెట్టు కింద వినాయకుడి బొమ్మ ఆనవాలు కూడా లేదు. అయ్యో ..ఇలాగైంది ఏమిటి అని భాదపడుతూ కయ్య తట్టు చూసాడు. ఎర్రటి దాసానిపూలతో నిండి పెద్ద మడుగుని తలపిస్తోంది మెట్ట కయ్య. పూలతో పాటు తమలపాకులు కూడా తేలతా ఉండాయి నీళ్ళల్లో. రెండు చేతులు ఎత్తి కయ్య తట్టు చూసి మొక్కతా “వినాయక స్వామి..! నిన్న పూజ అంతా చేసి, చివర్లో నిమజ్జనం చేయలేదని నీకు నువ్వే నిమజ్జనం ఆయినవా స్వామి ఈ కయ్యలో” కళ్ళు మూసుకున్నాడు భక్తిగా తిరుపాలు. అప్పటికే ఊరోళ్లంతా వచ్చేసుండారు కయ్యలకాడికి. మూడు పదునుల పైనే వాన కురిసినట్లు ఉండాది. అందరి ముఖాల్లో ఆనందం. కయ్యలు నీళ్ళతో నిండిపోయి ఉండాయి.

“పందుము తిన్నా పరగడుపే – ఏదుము తిన్నా ఏకాశే” అన్నట్లు వారం దినాల్లో పడిన వాన అంతా ఆవిరైనట్లు నీళ్ళు ఇంకిపోయినాయి. మళ్ళీ గుంటలు ఎండిపోసాగాయి. తిరుపాలు మెట్ట కయ్య, వినాయకుడికి పూజ చేసిన కయ్య మాత్రం ఎండలేదు. పడమటి తట్టు భూమిలోనుంచి జలధారలు పైకి ఎగదన్నుకొస్తా ఉండాయి. చుక్క. ఆ కయ్య పెద్ద చెరువుని తలపిస్తోంది. నీళ్ళు తగ్గలేదు. కయ్య నీళ్ళతో నిండిపోయి, నీళ్ళు గెనెమగట్ల పైకి పొర్లాతా ఉండాయి. “ఈశ్వరా..ఇన్ని దినాలకి మామీద దయచూపావా తండ్రి. గంగమ్మ తల్లిని మెట్ట కయ్యలోకి పంపావా మహాదేవా”. ఆ క్షణం తిరుపాలుకి ఓ ఆలోచన. ఇప్పుడు బోరు తవ్వించుకుంటే ఇక నీళ్ళకి కరువుండదు. కానీ బోరు తవ్వుకుంటే తనకొక్కడికే లాభం. ఈ చిన్న మడుగులాంటి కయ్యని ఇంకా లోతుకి తవ్వించి,చుట్టూరా గట్లు కట్టించి, నీళ్లు నిల్వచేసుకుంటే తన చుట్టుపక్కల కయ్యలకి కూడా నీరు అందించవచ్చు. తనకు ఉండే ఒక మాగాణి కయ్యతో తన బతుకు గడిచిపోతుంది. తను ఒక్కడే బాగుపడితే చాలదు. తనచుట్టూ ఉండేవాళ్ళు కూడా బాగుండాలి. ఆ ఆలోచనతో తిరుపాలు ఊరందరికీ బంధువు అయినాడు. అందరికోసం ఒక్కడు నిలిచి, ఒక్కడి కోసం అందరు కదిలి తిరుపాలు మెట్ట కయ్యని సాగునీళ్ళ మడుగుగా మార్చుకున్నారు.